అమెరికాలో భారత సంతతి చిన్నారి మృతి.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష..

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఓ భారతసంతతి చిన్నారి బుల్లెట్‌ గాయంతో మరణించింది.

Update: 2023-03-27 03:25 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఓ భారతసంతతి చిన్నారి బుల్లెట్‌ గాయంతో మరణించింది. కాగా, ఈ కేసులో నిందితుడుకి 100 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. జోసెఫ్ లీ స్మిత్(35) అనే వ్యక్తి హోటల్‌ సూపర్ 8 మోటెల్ పార్కింగ్ స్థలంలో మరొక వ్యక్తితో గొడవ పడ్డాడు. కోపాద్రికుడైన స్మిత్ బుల్లెట్‌తో అతడిని కాల్చుతుండగా.. ఆ వ్యక్తికి తగలకుండా పక్కనే ఉన్న గదిలో ఆడుకుంటున్న మాయ పటేల్ (5) తలకు బుల్లెట్ తగిలింది. గమనించిన మాయ తల్లిదండ్రులు విమల్, స్నేహల్ పటేల్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. మాయ ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ.. 23 మార్చి 2021న మరణించింది. కాగా, ఇటీవల ఈ కేసును విచారించిన అమెరికా జిల్లా న్యాయస్థానం, చిన్నారి మృతికి కారణమైన స్మిత్‌కు 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు విచారణను అడ్డుకున్నందుకు ఇటీవలే కోర్టు 20 ఏళ్లు, తీవ్ర నేరాలు పునరావృతం చేస్తున్నందుకు మరో 20 ఏళ్లు, మొత్తం 100 ఏళ్లు జైల్లోనే గడపాలని దిమ్మతిరిగే తీర్పును వెలువరించింది. పెరోల్ లేక శిక్షలో ఎటువంటి తగ్గింపు అవకాశాలు లేకుండా శిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో నిందితుడు స్మిత్‌కు ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 100 ఏళ్ల జైలు శిక్ష పడింది.

Tags:    

Similar News