వారాంతం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కీలక రిలయన్స్, ఐటీసీ వంటి కంపెనీల షేర్లలో ర్యాలీ కలిసొచ్చింది.

Update: 2024-05-10 11:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల సంకేతాలు, కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కారణంగా సూచీలు లాభాలను సాధించాయి. ఎన్నికలు, విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, ద్రవ్యోల్బణం వంటి అంశాల విషయంలో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కీలక రిలయన్స్, ఐటీసీ వంటి కంపెనీల షేర్లలో ర్యాలీ కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 260.30 పాయింట్లు లాభపడి 72,664 వద్ద, నిఫ్టీ 97.70 పాయింట్ల లాభంతో 22,055 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫార్మా, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టైటాన్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News