త్వరలో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు!

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో కొత్త నెట్‌వర్క్ సేవలను వినియోగదారులకు అందించనున్నట్టు వెల్లడించింది.

Update: 2023-04-25 16:55 GMT

ముంబై: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో కొత్త నెట్‌వర్క్ సేవలను వినియోగదారులకు అందించనున్నట్టు వెల్లడించింది. జియో ఎయిర్‌ఫైబర్‌గా పిలవబడే వైఫై సర్వీస్‌ను తీసుకురానున్నట్టు తెలిపింది. గతేడాది రిలయన్స్ సంస్థ సర్వసభ్య సమావేశంలోనే దీనికి సంబంధించి ప్రకటన ఇచ్చినప్పటికీ, ఎప్పటి నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయో స్పష్టత ఇవ్వలేదు. తాజాగా మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవలు అందించనున్నట్టు రిలయన్స్ అధ్యక్షుడు కిరణ్ థామస్ చెప్పారు.

ధరలకు సంబంధించి ఆయన పేర్కొనలేదు. జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులోకి వస్తే గనక ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, యాక్ట్ వంటి ఫిక్స్‌డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సవాలుగా మారనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, జియో ఎయిర్‌ఫైబర్ అంటే కేబుల్స్‌తో పనిలేకుండా డివైజ్‌కు సమీపంలోని జియో టవర్స్ నుంచి సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించే విధానం. సాధారణంగా బ్రాండ్‌బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. వీటికోసం వైర్, మోడమ్ వంటి పరికరాలు అవసరమవుతాయి. ఎయిర్‌ఫైబర్ సింగిల్ డివైజ్ ద్వారా వైఫై సేవలందిస్తుంది.

Tags:    

Similar News