హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు!
ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి హైదరాబాద్లో మొత్తం 4,597 ఇళ్లు లేదా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు..Latest Telugu News
హైదరాబాద్: ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి హైదరాబాద్లో మొత్తం 4,597 ఇళ్లు లేదా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటి విలువ రూ. 2,237 కోట్లని, అదేవిధంగా ప్రస్తుత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నగరంలో మొత్తం 56,003 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరగ్గా, వీటి విలువ రూ. 27,509 కోట్లని తెలిపింది.
గతేడాది ఇదే సమయంలో రూ. 30,108 కోట్ల విలువైన 67,685 ఇళ్లు లేదా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక పేర్కొంది. రూ. 25-50 లక్షల ధరలో రెసిడెన్షియల్ యూనిట్లు గత నెలలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 51 శాతం వాటాను కలిగి ఉన్నాయని, గతేడాది అక్టోబర్లో ఇవి 40 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది.
రూ. 25 లక్షల కంటే తక్కువ ధరలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గగా, గత ఏడాది ఇదే సమయంలో 35 శాతంతో పోలిస్తే ఈసారి 22 శాతంగా ఉన్నాయి. రూ. 50 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 2021, అక్టోబర్లో 25 శాతం ఉండగా, ఈసారి 27 శాతానికి పెరిగి బలమైన డిమాండ్ను కలిగి ఉన్నాయి.
గత మూడు త్రైమాసికాల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడంతో పాటు ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వినియోగదారుల నుంచి గిరాకీ నెమ్మదిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది హైదరాబాద్ మార్కెట్పై కూడా ఉంది. అయితే ఖరీదైన ఇళ్లకు డిమాండ్ ఆశాజనకంగా కనిపిస్తోందని నైట్ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు.