వీదా బ్రాండ్ స్కూటర్ల ధరలు తగ్గించిన హీరో మోటోకార్ప్!

ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ వీదా ధరను తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.

Update: 2023-05-03 16:59 GMT

బెంగళూరు: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ వీదా ధరను తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. వీదా వీ1 ప్లస్ ధరను రూ. 25,000, వీదా వీ1 ప్రో ఈవీ స్కూటర్ ధరను రూ. 19,000 తగ్గిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లో విడుదల చేసిన సమయంలో వీటి ధరలు వరుసగా రూ. 1.45 లక్షలు, రూ. 1.59 లక్షలతో తీసుకొచ్చింది. ఇదే సమయంలో కంపెనీ ఈ ఏడాది వీదా ఈవీ బ్రాండ్ ఉనికిని 100 నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కార్యకలాపాలను వేగంగా చేసే లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం కంపెనీకి చెందిన డీలర్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తామని హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్, నాగ్‌పూర్, నాసిక్, చెన్నై, కొచ్చి, కాలికట్ వంటి కొత్త నగరాలకు విస్తరణ ప్రణాళికను ప్రారంభించామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి వీదా బ్రాండ్ బెంగళూరు, జైపూర్, ఢిల్లీల్లో అందుబాటులో ఉందని శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Tags:    

Similar News