వారం వ్యవధిలో Google కు వరుసగా రెండోసారి భారీ షాక్
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరో భారీ జరిమానా విధించింది. .Latest Telugu News
న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరో భారీ జరిమానా విధించింది. ఇటీవలే జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత వారం వ్యవధిలో మరోసారి పెనాల్టీ విధిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్రకటించింది.
ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి గూగుల్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారణ అయిందని, దీన్ని పరిగణనలోకి తీసుకుని రెండోసారి రూ. 936.44 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు సీసీఐ పేర్కొంది. దీంతో గూగుల్పై మొత్తం జరిమానా రూ. 2,274 కోట్లకు పెరిగింది. అలాగే, ప్లే స్టోర్లో తమ సొంత యాప్లే మొదటగా వచ్చే విధంగా చేసే విధానాలను తక్షణం మానుకోవాలని సీసీఐ స్పష్టం చేసింది.
నిర్దేశించిన సమయంలోగా పనితీరు మార్చుకోవాలని సూచించింది. కాగా, ఈ నెల 20న మొదటగా సీసీఐ రూ. 1,337.76 కోట్ల జరిమానాను గూగుల్కు విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్స్లలో అనైతిక వ్యాపార విధానాలను అనుసరిస్తున్న కారణంగా జరిమానా చర్యలు తీసుకున్నట్లు సీసీఐ వెల్లడించింది.