డేటా సెంటర్ల కోసం అదానీ రూ.41 వేల కోట్ల పెట్టుబడి
గౌతమ్ అదానీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) డేటా సెంటర్ సామర్థాన్ని మరింత విస్తరించడానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది.
దిశ, బిజినెస్ బ్యూరో: గౌతమ్ అదానీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) డేటా సెంటర్ సామర్థాన్ని మరింత విస్తరించడానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. దీని కోసం రాబోయే ఐదేళ్లలో రూ.41 వేల కోట్ల($5 బిలియన్లను) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. వీటిలో సగానికి పైగా పెట్టుబడులు ఈ ఏడాదిలోనే కేటాయించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్, స్వీడన్కు చెందిన EQT యాజమాన్యంలోని EdgeConneX మధ్య జాయింట్ వెంచర్ అయిన AdaniConneX 2030 నాటికి 1 GW డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం $1.2-1.4 బిలియన్ల ఆఫ్షోర్ రుణాన్ని పొందేందుకు అనేక అంతర్జాతీయ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. రాబోయే వారాల్లో ఈ డీల్ ఖరారు కావచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటి వరకు చెన్నైలో ఒకే ఒక డేటా సెంటర్ను కలిగి ఉన్న AdaniConnex, ప్రస్తుతం నోయిడా, హైదరాబాద్లలో దాదాపు మూడింట రెండు వంతుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీని కోసం జాయింట్ వెంచర్ సంస్థ జూన్లో $213 మిలియన్ల రుణాన్ని సేకరించింది.