ఎఫ్పీఓ రద్దు చేస్తూ అదానీ ఎంటర్ప్రైజెస్ సంచలన నిర్ణయం!
అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం చివరిరోజు ఎఫ్పీఓ ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియ విజయవంతమైనప్పటికీ దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది
ముంబై: అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం చివరిరోజు ఎఫ్పీఓ ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియ విజయవంతమైనప్పటికీ దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఇటీవల హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో వరుసగా అదానీ కంపెనీ షేర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ) విజయవంతమవుతుందా లేదా అనే సందేహాలుండేవి. కానీ, అనూహ్యంగా ఎఫ్పీఓ చివరిరోజు పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది.
అంతా బాగుందనుకునే సమయంలో అదానీ ఎంటర్ప్రైజెస్ బుధవారం సమావేశంలో ఎఫ్పీఓలు రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రతికూల పరిస్థితులకు తోడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరతను పరిగణలోకి తీసుకుని ఎఫ్పీఓను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. ఎఫ్పీఓకు సంబంధించిన మొత్తాలను పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం ద్వారా కంపెనీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలని నిర్ణయించినట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. కాగా, బుధవారం కంపెనీ షేర్ ధర 28.5 శాతం క్షీణించి రూ. 2,128 వద్ద ముగిసింది.