Breaking: రాజంపేటలో టీడీపీ నేత నరహరి అరెస్ట్.. ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నేత గంటా నరహరిని పోలీసులు అరెస్ట్ చేశారు....

Update: 2023-11-05 11:19 GMT

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నేత గంటా నరహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న నరహరిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పడంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ నేత నరహరిని అరెస్ట్ చేసి రాజంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే నరిహరి ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత రాత్రే నరహరిని పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ నేత నరహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. రెండేళ్లుగా అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన తాము ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. వరద బాధితులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నరహరి హెచ్చరించారు. 

Tags:    

Similar News