ఎవరేం అనుకున్నా.. అమరావతికే నా ఓటు: వైసీపీ ఎమ్మెల్యే

ఎవరు ఏం అనుకున్నా నాకు అనవసరం. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం నా ధర్మం.

Update: 2023-03-02 07:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరు ఏం అనుకున్నా నాకు అనవసరం. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం నా ధర్మం. అదే సమయంలో తనకు మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అంటున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనసులో ఏమున్నా ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొడతారు. ఆయన తండ్రి సైతం అంతే అనుకోండి. అయితే తాజాగా మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు వసంత కృష్ణప్రసాద్. మూడు రాజధానులు అనేది వైసీపీ విధానం అని చెప్పుకొచ్చారు. అయితే వ్యక్తిగతంగా తన ఓటు మాత్రం అమరావతికేనని చెప్పుకొచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని కవులూరులో పర్యటించిన వసంత కృష్ణప్రసాద్‌ను ప్రజలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

అమరావతిపై మీ ఒపినీయన్ చెప్పాలని నిలదీశారు. ఈ ప్రాంత వాసిగా రాజధాని అమరావతిపై మీరెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజధానిపై గందరగోళ ప్రకటనలు చేయడంతో ఈ ప్రాంతంలో తమ భూముల రేట్లు అమాంతం పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు రాజధాని తరలిపోతుందన్న ఆవేదన సైతం తమలో ఉందని చెప్పుకొచ్చారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. దీనికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సమాధానమిచ్చారు. వ్యక్తిగతంగా తన మద్దతు అమరావతికేనని....కాకపోతే ప్రభుత్వ విధానానికే తాను కట్టుబడి ఉండాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో తాను ఏమీ చేయలేనని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తేల్చి చెప్పేశారు.

Tags:    

Similar News