రాష్ట్ర ప్రజలకు కీలక సూచన.. మూడ్రోజుల్లో అక్కడ తీవ్ర తుఫాను
గత నెల రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
దిశ, వెబ్డెస్క్: గత నెల రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాల రాకతో జనాలకు ఎండల నుంచి ఉపశమనం కలిగింది. కానీ పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గత ఏడాది కంటే ముందే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు చురుగ్గా వ్యాపించి వర్షాలు కురిస్తోన్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రేపటిలోగా అల్పపీడనంగా మారుతుందని, తర్వాత వాయుగుండంగా బలపడుతుందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను వల్ల ఏపీకి ఎలాంటి ముప్పు లేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే చాన్స్ ఉందని తెలిపింది. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ముప్పులేదని వాతావరణ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.