Ap Politics:ప్రశ్నిస్తే కేసులు..వైసీపీ సర్కార్పై నారా లోకేష్ ధ్వజం
వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో ఆయన పాల్గొన్నారు.
దిశ, ఏలూరు:వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో ఆయన పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 23 కేసులు పెట్టారని చెప్పారు. తాజాగా మరో కేసు పెట్టారన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ మా అత్తారిల్లు లాగా అయిందని వెళ్లడం, రావడం జరుగుతోందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అందించిన వారేనని అన్నారు. ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారని, ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు.
కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డీఎస్సీ ప్రకటన పైనే ఉంటుందని లోకేష్ చెప్పారు. యూనిఫైడ్ పోర్టల్, ఉద్యోగ ప్రకటన తెస్తామని, ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు సింగిల్ నోటిఫికేషన్తో క్యాలెండర్ ఇస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఐదేళ్లలో భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. యువత కలలకు రెక్కలు తొడుగుతామని నారా లోకేశ్ యువతరానికి భరోసా ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి మేనిఫెస్టో తయారైందని అన్నారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్పోర్టు, జైన్ ఇరిగేషన్, మెగా సీడ్ పార్కు, సోలార్ పవర్, ఉర్దూ యూనివర్సిటీ టీడీపీ తెచ్చిందని గుర్తు చేశారు. జగన్ మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.