రాతియుగం నుంచి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు:నారా లోకేష్

నవశకానికి నాంది పలికేలా ఈ నెల 17వ తేదీన చిలకలూరి పేటలో సభ జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

Update: 2024-03-12 13:59 GMT

దిశ ప్రతినిధి, గుంటూరు:నవశకానికి నాంది పలికేలా ఈ నెల 17వ తేదీన చిలకలూరి పేటలో సభ జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాతి యుగం నుంచి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు అని వివరించారు. 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మళ్లీ ప్రభంజనం సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో విధ్వంసం అయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చేతులు కలిపిన మూడు పార్టీల పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని అన్నారు. చిలకలూరిపేట సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నేతలతో 13 ముఖ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు.

ఈ కమిటీల సభ్యులతో మంగళవారం లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..బుధవారం ఉదయం 9.30 గంటలకు బొప్పూడి లో భూమి పూజ జరుగుతుందన్నారు.ఎన్డీయేలో టీడీపీ చేరిన తర్వాత ఇది తొలి సభ అని, సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేద్దామన్నారు. సభకు లక్షలాది మంది తరలి వస్తారని, చరిత్రలో నిలిచేలా సభను నిర్వహిద్దామన్నారు. కమిటీల ప్రకారం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించి సభ విజయానికి కృషి చేయాలన్నారు. మూడు పార్టీల పొత్తు, అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై సభా వేదిక ద్వారా పార్టీ అగ్ర నేతలు ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నేతలు, కమిటీల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read More..

జగన్ నా దోస్త్!.. పొత్తులపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News