AP Politics:టీడీపీ హయాంలో రోడ్లన్నీ ధ్వంసం:విడదల రజిని
గుంటూరు నగరాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుకుందామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని తెలిపారు.
దిశ ప్రతినిధి,గుంటూరు:గుంటూరు నగరాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుకుందామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని తెలిపారు. స్థానిక శ్యామలానగర్ రెండో లైనులోని మంత్రి నివాసానికి గురువారం నగరంలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ నగర అభివృద్ధి విషయంలో టీడీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఏ మాత్రం ప్రణాళిక లేకుండా గుంటూరులోని రోడ్లన్నీ పగులగొట్టి ధ్వంసం చేశారని దుయ్యబట్టారు.
వారు చేసిన పాపం ఫలితంగా గుంటూరు నగరం టీడీపీ హయాంలో అన్ని అంశాల్లో దారుణంగా పడిపోయిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని రోడ్లు తీర్చిదిద్దామన్నారు. కొత్తగా ఎన్నో రహదారుల నిర్మాణం జరిగిందని వెల్లడించారు. దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకోని రహదారులకు కూడా మోక్షం కలించామని చెప్పారు. గాంధీ పార్క్, శిల్పారామం. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తనను గెలిపిస్తే గుంటూరు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా మార్చడమే తన లక్ష్యమని వెల్లడించారు.
39వ డివిజన్ నుంచి..
నగరంలోని 39వ డివిజన్ నుంచి 23 మంది జనసేన, టీడీపీ ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్, ప్రభు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. లాజర్ బాబు, జి.ప్రభు, మాసిపోగు అనూష, ఎం.రాణి, గోన అశోక్, ఎన్నుబర్ల బాబు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
30 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి..
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకుడు ముద్దాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 30 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ముద్దాడ కృష్ణ, ముద్దాడ శివ, విజయలక్ష్మి, కుమారి, శారదా, విజయకుమారి, లక్ష్మి, శివకుమారి, జయశ్రీ, విజయలక్ష్మి రెడ్డి తదితరులు ఉన్నారు.