సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. ఆ రాష్ట్రాల్లా చొరవ తీసుకోవాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘సమగ్ర కులగణన’ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు...

Update: 2023-04-13 11:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘సమగ్ర కులగణన’ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. భారతదేశంలో 1931 తర్వాత కుల గణన జరగని కారణంగా దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఏడు దశాబ్ఢాలుగా సరైన స్థాయిలో రిజర్వేషన్లు లేక దామాషా అవకాశాలు పొందలేక అభివృద్ధికి దూరం అవుతున్నారని లేఖలో తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు వాటి పర్యవేక్షణ కూడా కుల గణన లేకుండా వీలు కాదని వ్యాఖ్యానించారు. ఏ కులం పరిస్థితి ఏమిటి?, వాటి జనసంఖ్య ఎంత? ఏ కులానికి బీసీ స్థాయి అర్హత ఉంది?, ఎవరికి అటువంటి అర్హత ఉండదు? అనే మౌలిక ప్రశ్నలకు సమాధానం జనగణనలో సమగ్ర కుల గణన జరపకుండా వీలు కాదని సోము వీర్రాజు వెల్లడించారు. అనేక రాష్ట్రాల్లో బీసీల అభివృద్ధి విషయంలో తమ బాధ్యత రీత్యా జనగణనలో సమగ్ర కుల గణన కూడా జరపాలని డిమాండ్ ఉందని చెప్పారు.

2021 నుండి నేటి వరకు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. తమ తమ శాసన‌సభలో కుల గణనకు అనుకూలంగా తీర్మానాలు చేశాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి తీర్మానాన్ని 23-11-2021న ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు సమగ్ర కులగణన జరిపిస్తున్నాయని, అదే చొరవతో ఏపీ ప్రభుత్వం కూడా కులగణన జరిపించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన 105వ రాజ్యాంగ సవరణ చేసిన తరువాత పలు రాష్ట్రాలు కులగణన ప్రారంభించాయని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం ఫెడరల్ స్పూర్తితో రాష్ట్రాలు కులగణన చేయాలని అవకాశమిస్తే అందుకు భిన్నంగా.. ఆ నెపం కేంద్రం మీదుకు తోసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కూడా కులగణన సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్‌ను సోము వీర్రాజు కోరారు.

Tags:    

Similar News