కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్..? సంచలనం రేపుతోన్న సీఎం కామెంట్స్

సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.

Update: 2023-03-14 12:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీ అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సమావేశమైన కేబినెట్ మీటింగ్‌లో పనితీరుపై పలువురు మంత్రులను జగన్ హెచ్చరించారు. మంత్రుల పనితీరు బాగోలేకపోతే మంత్రి వర్గం నుండి తప్పిస్తానని సీఎం జగన్ మంత్రులను హెచ్చరించారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను మంత్రులు బలంగా తిప్పికొట్టాలని.. ప్రభుత్వం ఈ నాలుగేండ్లలో ఏం చేసిందో ప్రజలకు వివరించాలని ఆదేశించారు.

ఈ విషయంలో మంత్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదని లేదని జగన్ తేల్చి చెప్పారు. శాఖపరంగా, పనితీరు ఆధారంగా కేబినెట్‌లో మార్పులు ఉంటాయని సైతం ఆయన స్పష్టం చేశారు. మంత్రుల పనితీరును తాను గమనిస్తున్నాని.. సరిగ్గా పని చేయని వారిని మంత్రి మండలి నుండి తొలగించడానికి కూడా వెనకాడనని జగన్ కేబినెట్ భేటీలో తేల్చిచెప్పారు. దీంతో మంత్రుల మార్పుపై సీఎం జగన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల వేళ కేబినెట్ నుండి సీఎం జగన్ ఎవరిని తొలగిస్తారనేది వైసీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది.

కేబినెట్ నుండి ఆ ఇద్దరు ఔట్..?

సీఎం జగన్ కేబినెట్ నుండి ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యంగా ఇద్దరు మంత్రులు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్‌కు కేబినెట్ నుండి ఉద్వాసన పలుకుతారని ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిని మంత్రి మండలి నుండి తప్పించి.. దాడిశెట్టి రాజా స్థానంలో తోట త్రిమూర్తులుకు, చెల్లుబోయిన వేణుగోపాల్ స్థానంలో కవురు శ్రీనివాస్‌కు జగన్ కేబినెట్‌లో అవకాశం కల్పిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా మర్రి రాజశేఖర్‌కు కూడా కేబినెట్‌లో స్థానం దక్కవచ్చని ప్రచారం జరగుతోంది.

Tags:    

Similar News