ఒడిశా రైలు ప్రమాద మృతులకు సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదంలో వందలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Update: 2023-06-04 08:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదంలో వందలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు చనిపోయిన, తీవ్రంగా గాయపడిన, స్వల్ప గాయాలతో బయటపడ్డ వారి కోసం సీఎం వైఎస్ జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తీవ్రంగా గాపడ్డవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి అదనంగా ఇది ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. బాలాసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఒకరు మరణించారని, ఇది తప్ప రాష్ట్రానికి చెందిన వారెవరు ఈ ఘటనలో మరణించినట్టుగా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారికి మంచి వైద్యసదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.

Tags:    

Similar News