జగనన్న చెప్పినా నమ్మరే..?.. తగ్గిపోతున్న ఆ సంఖ్య

ఈ ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామని ఐ ప్యాక్ సమావేశంలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వెల్లడించారు..

Update: 2024-05-18 02:00 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఈ ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామని ఐ ప్యాక్ సమావేశంలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వెల్లడించారు. గతంలో వచ్చిన 151 కంటే ఒక్క సీటైనా ఎక్కువే వస్తుందని విశాఖలో పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. ‘175కి 175 సీట్లు సాధించే దిశగా అడుగులు వేశాం. జూన్ 9న విశాఖలోనే ముఖ్యమంత్రిగా జగన్ రెండోసారి ప్రమాణం చేస్తారు. సమయం, వేదిక త్వరలో చెబుతాం’ అని మరో మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు.

అయినా నమ్మకం కుదరడం లేదే..?

ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ వైసీపీ ముఖ్యనేతలు అఖండ విజయంపై ప్రకటనలు చేస్తున్నా నేతలు, కార్యకర్తలకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఫలితాలపై పందేలు కాసేవారు వీరిని అస్సలు నమ్మడం లేదు. ఢంకా బాది గెలుస్తామని వీరు చేస్తున్న ప్రకటనలను బెట్టింగ్ మార్కెట్ అస్సలు నమ్మడం లేదు. సరికదా అపనమ్మకంతో వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్యను రోజు రోజుకూ తగ్గిస్తోంది.

ఆన్‌లైన్ బెట్టింగ్ మార్కెట్ ఫిగర్ 65-68

వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య 65- 68 కి దిగజారింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఆన్‌లైన్ సైట్‌లో రోజు రోజుకూ వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. పోలింగ్‌కు ముందు ఇది 80 దగ్గర ఉంది. పోలింగ్ రోజు 75 వద్ద ఉన్న వైసీపీకి వచ్చే సీట్లు ఆ తరువాత 70కి తగ్గాయి. జగన్ ఐ ప్యాక్ సమావేశంలో 160 అన్న తరువాత ఆ సంఖ్య విచిత్రంగా 65-68కి పడిపోయింది. వైసీపీ 70 సీట్ల మార్కు దాటదని పెద్ద సంఖ్యలో ఏకపక్షంగా పందేలు కాయడంతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు దానిని 65కు తగ్గించారు. వైసీపీకి ఎంపీ సీట్లు తొమ్మిది వస్తాయన్న దానిపైనా పందేలు జరుగుతున్నాయి.

తెలుగుదేశం సీట్లు 91-94

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య 91‌-94 మధ్య వుంది. 91 సీట్లు కూడా రావని, 94 కి పైగా వస్తాయని అదే సైట్‌లో పందేలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజు 88-90 మధ్య వున్న ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. కూటమితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సింగిల్‌గా వచ్చే సీట్ల సంఖ్య ఇది.

భీమవరం పందేలు 1:2

ఇక వేల కోట్ల పందేలు జరిగే భీమవరంలో వైసీపీ విజయావకాశాలపై 1:2 నిష్పత్తిలో పందేలు జరుగుతున్నాయి. వీటికి కూడా పెద్దగా ముందుకు రావడంలేదని తెలిసింది. అంటే వైసీపీ గెలిస్తే లక్షకు రెండు లక్షలు ఇస్తారు. కూటమి గెలిస్తే లక్షకు లక్ష ఇస్తే చాలు. నాయకులు విజయావకాశాల విషయంలో వైసీపీని జాకీలు పెట్టి ఎత్తినా వేల కోట్ల బెట్టింగ్ మార్కెట్ మాత్రం రోజు రోజుకూ తగ్గించేస్తుంది.

Read More..

సీఎం జగన్ లండన్ పర్యటనలో టెన్షన్.. అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్ 

Tags:    

Similar News