అర్చకుల బదిలీల్లో రాయ‘బేరా’లు.. చక్రం తిప్పుతున్న ఏసీ!

దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ అర్చకుల దగ్గర నుంచి అధికారుల వరకు ప్రతి ఆరు నెలలకు లేదా ఏడాదికోసారి అంతర్గత బదిలీలు చేపట్టాలనేది నిబంధన.

Update: 2023-03-01 02:42 GMT

దిశ, అన్నవరం: దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ అర్చకుల దగ్గర నుంచి అధికారుల వరకు ప్రతి ఆరు నెలలకు లేదా ఏడాదికోసారి అంతర్గత బదిలీలు చేపట్టాలనేది నిబంధన. కాగా, అన్నవరం దేవస్థానంలో కొందరు అధికారుల సొంత నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనేది పలువురి వాదన. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి అన్నవరం పర్యటన సందర్భంగా అంతర్గత బదిలీల వ్యవహారంపై ఆరా తీశారు. ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో సిబ్బందికి, అధికారులకు ఇటీవలే అంతర్గత బదిలీలు జరిగాయి. ప్రస్తుతం అంతరాలయం, యంత్రాలయం, ఉపాలయాల అర్చకులను బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ తతంగమంతా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సమక్షంలోనే జరగాల్సి ఉంది. అయితే, సహాయ కమిషనర్ రమేష్ బాబు ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

అర్చకులు ఎక్కువ మంది అంతరాలయం, మంత్రాలయాలకు వెళ్లేందుకు పోటీపడుతున్నారు. కనకదుర్గ, వనదుర్గ ఆలయాలకు వెళ్లేందుకు ముఖ్య అర్చకులు ఎవరు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది రాయబేరాలకు దిగుతున్నట్లు సమాచారం. ఇంకొంత మంది ఎమ్మెల్యే, మంత్రుల సిఫార్సులతో ఉన్నచోటనే స్థిరపడి పోవడానికి మంతనాలు సాగిస్తున్నట్లు భోగట్టా

Tags:    

Similar News