పోటీలో ఉంటారా.. లేదా?.. ‘భువనగిరి’పై నేడు CPIM నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు అంశంపై సీపీఎం నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అన్ని సెగ్మెంట్లలో మద్ధతు ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు.

Update: 2024-04-28 01:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు అంశంపై సీపీఎం నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అన్ని సెగ్మెంట్లలో మద్ధతు ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు. బీజేపీని ఓడించేందుకు సహకారమివ్వాలని కోరారు. ఇండియా కూటమి ధర్మాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... సీపీఎం నాయకులు తమ ఎదుట కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టారని వెల్లడించారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం నాయకులు అంగీకరించినట్లు తెలిపారు. అయితే స్థానికంగా కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఒకట్రెండు విషయాల్లో కొంత సందిగ్ధత ఉన్నా అధిష్టానంతో చర్చించి ఆదివారంలోపు ఏకాభిప్రాయానికి వస్తామని సీఎం వివరించారు. సీపీఎం సహకారంతో భవిష్యత్‌లో ముందుకెళ్తామని అన్నారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పని చేస్తుందని భావిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయాలపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.అయితే భువనగిరి సీటు విషయంలో సీపీఎంకు మద్దతు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డిని కోరామన్నారు. భువనగిరి సీటుపై సందిగ్ధత ఉన్నా, తమ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందన్నారు. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఈ చర్చల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News