ఐపీఎల్-2025లో ధోనీ ఆడతాడా?.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎస్కే సీఈవో

ఐపీఎల్-17లో చెన్నయ్ సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైన విషయం తెలిసిందే.

Update: 2024-05-23 12:37 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో చెన్నయ్ సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైన విషయం తెలిసిందే. ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అని కథనాలు వెలువడ్డాయి. అయితే, ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వచ్చే సీజన్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వచ్చే ఏడాది ఆడతాడని ఆశిస్తున్నట్టు తెలిపారు.

‘ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?లేదా? అన్నది నాకు తెలియదు. దీనికి ధోనీనే సమాధానం చెప్పగలడు. అతను ఏం నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాం. అతను సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాడని అందరికీ తెలుసు. కానీ, వచ్చే ఏడాది సీఎస్కేకు అతను అందుబాటులో ఉంటాడని మేము ఆశిస్తున్నాం. నేనే కాదు అభిమానులు ఇదే కోరుకుంటున్నారు.’ అని చెప్పుకొచ్చారు.

కాగా, ఈ సీజన్‌‌ ప్రారంభానికి ఒక్క రోజు ముందు ధోనీ సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతను గాయంతో ఇబ్బందిపడినప్పటికీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 220 స్ట్రైక్‌రేటుతో 161 పరుగులు చేశాడు. గాయానికి చికిత్స కోసం ధోనీ త్వరలోనే లండన్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News