హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్‌కు వర్ష ముప్పు.. రద్దయితే హైదరాబాద్‌కు లాభమే.. ఎలా ఉంటే?

: ఐపీఎల్-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి.

Update: 2024-05-23 13:14 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. శుక్రవారం చెన్నయ్‌లోని చెపాక్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. దీంతో ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందోనని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ కీలకమైన పోరుకు వర్ష ముప్పు ఉండటం ఆందోళన కలిగించే విషయం.

భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. చెన్నయ్‌లో రాబోయే 48 గంటలపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే, భారీ వర్షం కాకుండా తేలికపాటి వర్షం పడనున్నట్టు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్ష ముప్పు నేపథ్యంలో కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్‌ జరుగుతుందా?లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్వాలిఫయర్-2 కూడా వర్షం కారణంగా రద్దైతే ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించిన విషయం తెలిసిందే. శుక్రవారం వర్షం పడి ఆట సాధ్యం కాకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. శుక్రవారం మ్యాచ్ ప్రారంభమై మధ్యలో నిలిపివేస్తే అక్కడి నుంచి రిజర్వ్ డేలో కొనసాగిస్తారు.

రిజర్వ్ డే కూడా వర్షార్పణమైతే లీగ్ స్టేజ్‌లో పాయింట్స్ టేబుల్‌లో మెరుగ్గా ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ వర్షం కారణంగా క్వాలిఫయర్-2 రద్దయితే హైదరాబాద్ జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఎందుకంటే, లీగ్ దశలో పాయింట్స్ టేబుల్‌లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండటమే కారణం. రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.  

Tags:    

Similar News