ఆర్సీబీకి చెప్పాం.. వినలేదు : కోహ్లీకి ఉగ్ర ముప్పుపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ క్లారిటీ

ఐపీఎల్-17లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.

Update: 2024-05-22 14:33 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది. భద్రతా కారణాల వల్లే బెంగళూరు ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుందని వార్తలు వచ్చాయి. విరాట్ కోహ్లీకి భద్రత ముప్పు పొంచి ఉన్నట్టు గుజరాత్ పోలీసులు కూడా ధ్రువీకరించారని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) ఖండించింది. ఎలాంటి ఉగ్ర ముప్ప లేదని, వేడిగాలుల కారణంగా బెంగళూరు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయలేదని స్పష్టం చేసింది.

‘గుజరాత్ కాలేజీ గ్రౌండ్‌లో బెంగళూరు, ఆర్సీబీ జట్లు ప్రాక్టీస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఆర్సీబీ 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టీస్‌ చేయాల్సి ఉండగా.. వారు సమయాన్ని 3 నుంచి 6 గంటలకు మార్చుకున్నారు. రాజస్థాన్ ప్లేయర్లు 3.30 నుంచి 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేశారు. వేడి గాలుల కారణంగా ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది. ప్రాక్టీస్‌కు అక్కడి ఇండోర్ సదుపాయాన్ని లేదా నరేంద్ర మోడీ స్టేడియంలోని ఇండోర్‌ను ఉపయోగించుకోవచ్చని వాళ్లకు చెప్పాం. కానీ, వేడి గాలుల కారణంగా వారు ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడలేదు.’ అని జీసీఏ సెక్రెటరీ అనిల్ పటేల్ తెలిపారు. నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరుగుతున్నందు వల్లే రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

Tags:    

Similar News