టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్కు అంపైర్లు వీళ్లే
జూన్ 2 నుంచి మొదలయ్యే పొట్టి ప్రపంచకప్ మ్యాచ్లకు ఐసీసీ బుధవారం మ్యాచ్ అఫీషియల్స్ను ప్రకటించింది.
దిశ, స్పోర్ట్స్ : మరో వారం రోజుల్లో టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానున్నది. జూన్ 2 నుంచి మొదలయ్యే ఈ పొట్టి ప్రపంచకప్ మ్యాచ్లకు ఐసీసీ బుధవారం మ్యాచ్ అఫీషియల్స్ను ప్రకటించింది. టీమ్ ఇండియా జూన్ 5 ఐర్లాండ్తో ఆడటం ద్వారా టోర్నీని ఆరంభించనుంది. అయితే, క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది.ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు మూడుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఇంగ్లాండ్కు చెందిన రిచార్డ్ ఇల్లింగ్వర్త్ అంపైర్గా వ్యవహరించనున్నాడు. అతనితోపాటు రోడ్నీ టక్కర్(ఆస్ట్రేలియా) కూడా ఫీల్డ్ అంపైర్గా వ్యవహరిస్తాడు. డేవిడ్ బూన్(ఆస్ట్రేలియా) మ్యాచ్ రిఫరీగా, క్రిస్టోఫర్ గఫానీ(న్యూజిలాండ్) టీవీ అంపైర్గా ఉండనున్నారు.
కాగా, ప్రపంచకప్ మ్యాచ్ అఫీషియల్స్ జాబితాలో భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కిన విషయం తెలిసిందే. అంపైర్లుగా జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, మ్యాచ్ రిఫరీగా శ్రీనాథ్ ఎంపికయ్యారు. మరోవైపు, బంగ్లాదేశ్కు చెందిన షాహిత్ సైకత్ పురుషుల టీ20 టోర్నీ చరిత్రలో అంపైర్గా వ్యవహరించే తొలి బంగ్లా అంపైర్గా నిలువనున్నాడు. జూన్ 2న అమెరికా, కెనడా మధ్య జరిగే ఓపెనింగ్ మ్యాచ్కు అతను అంపైర్గా వ్యవహరించనున్నాడు.