నేలకొండపల్లి వైన్స్ షాపు లో చోరీ
మండల కేంద్రంలోని ఓ వైన్స్షాపులో బుధవారం చోరీ జరిగింది.
దిశ, నేలకొండపల్లి : మండల కేంద్రంలోని ఓ వైన్స్షాపులో బుధవారం చోరీ జరిగింది. వైన్స్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కూసుమంచి రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీ వైన్స్ నిర్వాహకులు రోజులాగే మంగళవారం రాత్రి వైన్స్ షాపును మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి బుధవారం ఉదయం 11 గంటలకు షాపును తీసి చూడగా మద్యం కాటన్లు పక్కకు జరిపి, చిందర వందరగా పడేసి ఉన్నాయి.
గుర్తు తెలియని వ్యక్తులు షాపు పైన రేకుల నుంచి లోపలికి వెళ్లి షాపులో ఉన్న ఇరవై వేల రూపాయలు, ఒక ఫుల్ బాటిల్ దొంగలించినట్లు షాప్ యజమాని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. షాపులోని పై కప్పు రేకులు జరిపి ప్రవేశించినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.