పాతబస్తీలో రివాల్వర్ కలకలం.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరింపు
పెట్రోల్ కోసం లైన్లో రమ్మన్న సిబ్బందిపై పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి చంపేస్తానని బెదిరించిన ఘటన మీర్చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, చార్మినార్: పెట్రోల్ కోసం లైన్లో రమ్మన్న సిబ్బందిపై పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి చంపేస్తానని బెదిరించిన ఘటన మీర్చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రివాల్వర్తో బెదిరించిన వ్యక్తులను పట్టుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది మీర్చౌక్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్తుండగా రెప్పపాటులో పరారయ్యారు. ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతోంద. మీర్చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ మీర్చౌక్ పరిధిలోని ఏతేబార్ చౌక్ ప్రాంతంలోని హైదరాబాద్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్కు బుధవారం రాత్రి 7.50కి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చారు.
అప్పుడే ముస్లిం సోదరులు ఉపావాస దీక్షలు వదిలిపెట్టడం.. రాకపోకలు సాగిస్తుండడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్లో రద్దీ పెరిగింది. క్యూ లైన్ లో రాకుండా ఆ ఇద్దరు వ్యక్తులు తమకే ఫస్ట్ పెట్రోల్ పోయాలంటూ బెదిరించారు. అందుకు పెట్రోల్ బంక్ సిబ్బంది క్యూలైన్ లో రావాలని చెప్పడంతో కోపోద్రిక్తులైన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్న ఓ రాడ్ తీసి కొట్టడానికి యత్నించారు. సిబ్బంది పట్టుకోవడంతో ఆ ఇద్దరిలో ఒక్కరు రివాల్వర్ తీసి పాయింట్ బ్లాక్లో గురిపెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఆ ఒక్క క్షణం తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది ధైర్యం చేసి ఆ ఇద్దరిని పట్టుకున్నారు.
మీర్చౌక్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్తుండగా రెప్పపాటులో పరారయ్యారు. ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ మేనేజర్ వినయ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్చౌక్ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. పెట్రోల్ బంక్లో ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంతకు ఇద్దరు వ్యక్తు ఎవరు.. ఏ వెపన్ ఉపయోగించి బెదిరించారనే వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. అదే పెట్రోల్ బంక్లో ఇది వరకు మూడు, నాలుగు సార్లు సిబ్బందిని బెదిరించిననట్లు సమాచారం. నిందితుల కోసం మీర్చౌక్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.