నిజామాబాద్ నగరంలో పట్టపగలే చోరీ
నిజామాబాద్ నగరంలో దొంగలు పట్టపగలు రెచ్చిపోయారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దొంగలు పట్టపగలు రెచ్చిపోయారు. పోస్టల్ ఉద్యోగి తన భార్యతో కలిసి బయటకు వెళ్లిన గంట వ్యవధిలోనే ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ 100 ఫీట్ల రోడ్ లోని తుల్జా భవాని టెంపుల్ వద్ద గల ఒక ఇంట్లో జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మధు మోహన్ తన భార్యతో కలిసి శనివారం మధ్యాహ్నం కార్ షోరూమ్ కు వెళ్లాడు.
అక్కడి నుంచి 45 నిమిషాల్లో ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో షాక్ కు గురయ్యారు. వారి ఇంటి పడకగదిలోని బీరువాను ధ్వంసం చేసి అందులోని 10 తులాల బంగారు నగలను, రెండు కిలోల వెండిని అగంతకులు అపహరించారు. బాధితులు ఈ మేరకు నాలుగో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకొని వేలిముద్రల ఆనవాళ్లను సేకరించారు. గంట వ్యవధిలో దొంగలు ఇంటిని దోచేసిన సంఘటన అందరికీ షాక్ నిచ్చింది. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.