Cyber Crime: మరోసారి రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా జిల్లా జడ్జీకి రూ.50 వేలు టోకరా

దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు తమ పంజాను విసురుతున్నారు.

Update: 2024-05-27 04:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు తమ పంజాను విసురుతున్నారు. కొందరికి స్టాక్ మార్కెట్ పేరిట పెట్టుబడులు పెట్టాలంటూ ఎగనామం పెడితే.. మరొకరికి ప్రైజ్ మనీ పేరిట సున్నం రాస్తున్నారు. మరికొందరికి స్నేహితుల పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ.. అమాయకులకు టోకరా వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. క్యాష్ పేమెంట్స్ నిలిచిపోవడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ జోరు పెరిగింది. దీంతో కొందరు ఘరానా మోసగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా, ఏకంగా జిల్లా కోర్టు జడ్జినే బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన జిల్లా జడ్జికి శుక్రవారం ఓ వాట్సప్‌ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సారాశం ఏంటంటే ‘నేను ముంబై హైకోర్టు న్యాయమూర్తిని, నాకు ఒక రూ.50 వేలు పంపండి. సాయంత్రం వరకూ మళ్లీ ఇస్తానంటూ దుండగుడు మెసేజ్ చేశాడు. వాట్సప్‌ డీపీలో న్యాయమూర్తి ఫొటో ఉండటంతో నిజమేనని నమ్మిన జిల్లా జడ్జి డబ్బు ఆ నెంబర్‌కు పంపించారు. ఈ క్రమంలోనే ఆగంతకుడి నుంచి పలుమార్లు ఫోన్లు రాగా.. అనుమానం వచ్చిన జడ్జి, హైకోర్టు రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. అక్కడే అసలు విషయం బయట పడింది. అసలు ఆయన ఎవరిని డబ్బు అడగలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన జడ్జి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News