నామినేషన్ ర్యాలీలో అపశృతి..వృద్ధురాలి దుర్మరణం

గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.

Update: 2024-04-25 15:19 GMT

దిశ, ప్రతినిధి: గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. బాపులపాడు మండలం రేమల్లె గ్రామం నుంచి గురువారం ర్యాలీలో పాల్గొనేందుకు రహదారిపై నిలబడి ఉన్న ఇద్దరు మహిళలను మరో యువకుడు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను చిన్న అవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు చికిత్స కోసం తరలించారు.

అయితే వృద్ధురాలు అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన వృద్ధురాలు రేమల్లె గ్రామానికి చెందిన మన్నెం సుశీల(65)గా వీరవల్లి పోలీసులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన సోదిమేళ్ళ కన్నమ్మకు కాలు, చెయ్యి విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన యువకుడు అదే గ్రామానికి చెందిన వాడని బంధువుల ఫిర్యాదు చేసిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని వీరవల్లి ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.

Similar News