- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇదే సరైన అవకాశంగా భావించిన భారత్.. మోడీ ప్రణాళిక ఇదే..!

భారతీయుల సంపూర్ణ కశ్మీర్ కల నెరవేరబోతున్నదా? పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్.. తిరిగి భారత్లో కలవబోతున్నదా? పహెల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న భారత్.. మరో అడుగు ముందుకు వేసి దశాబ్దాల కలను సాకారం చేసుకుంటుందా? ఇప్పుడు అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. ఇప్పటివరకు ఈ స్థాయిలో పాక్పై భారత్ దండెత్తలేదు. అదేసమయంలో అటువైపునుంచి కనీస ప్రతిస్పందన కూడా రావడం లేదు. డ్రోన్లు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న భారత్ను కనీసస్థాయిలో కూడా నిలువరించే శక్తి లేక పాక్ బిక్కుబిక్కుమంటున్నది. ఈ పరిస్థితుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ టార్గెట్గా సైన్యం అడుగులు వేసేందుకు ఇది సువర్ణ అవకాశమే. అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా భారీగా ఉండే అవకాశం లేదు.. ఇప్పుడు ప్రపంచం అంతా వాణిజ్య యుద్ధాలతో బిజీగా ఉన్నది. పైగా అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ గోలలో ఉన్నది. ఈ విషయంలో పాక్కు సహాయం చేసేందుకు ముందుకువచ్చే ఏకైక బలమైన దేశం చైనా.. కానీ, ఇప్పటివరకు భారత్ చేస్తున్న ఎదురుదాడులపై చిన్నాచితక ప్రకటనలు తప్ప ఆ దేశం సీరియస్ కామెంట్లు ఏమీ చేయలేదు. ఈ నేపథ్యంలో పీవోకే.. భారత్ నెక్ట్స్ టార్గెట్ అవుతుందా? మోడీ నేతృత్వంలోని కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఈ విషయంలో భారత్కు ఇప్పుడు ఏయే అవకాశాలు ఉన్నాయి? త్వరలో ఏం జరుగబోతున్నది? అన్న అంశాలు తెలుసుకుందాం.. హరీశ్, ఎస్పీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ కు ఇది సువర్ణావకాశం. అయితే, ఇది రాజకీయ, సైనిక, దౌత్యపరమైన అంశాలతో అత్యంత సంక్లిష్టతలతో నిండి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో భారత్కు అవకాశాలు ఎన్ని ఉన్నాయో.. అంతకు రెట్టింపు సవాళ్లు కూడా ఉన్నాయి. భారత్ తన దౌత్యపరమైన శక్తిని ఉపయోగించి పీవోకేను భారత భూభాగంగా ప్రకటించుకునేందుకు అంతర్జాతీయ సమాజంలో ఒక ఏకాభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. నిజానికి 2019లోనే అంటే ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే సంపూర్ణ జమ్మూ కశ్మీర్ను భారత్ తన భూభాగంలో భాగంగా ప్రకటించింది. ఇందులో పీవోకేతోపాటు చైనా ఆక్రమిత అక్సాయ్చిన్ కూడా ఉంది. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు భారత్కు అంతర్జాతీయ వేదికలపై మద్దతు పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. పహల్గాం ఉగ్రదాడి (2025 ఏప్రిల్) వంటి సంఘటనలు భారత్కు పాక్పై ఒత్తిడి పెంచే అవకాశాన్ని ఇస్తాయి. పాక్ ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ అస్థిరత దాని సైనిక సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. ఇది భారత్కు ఒక వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇవ్వనున్నది. భారత సైన్యం ఆధునికీకరణతోపాటు ఇప్పటికే సరిహద్దు రక్షణలో గణనీయమైన పురోగతి సాధించింది. సరిహద్దుల్లో భారత్ పైచేయి సాధిస్తుండటంతో, పీవోకేలో ఏదైనా ఒక ఆకస్మిక ఆపరేషన్ చేసేందుకు ఇప్పుడు అనుకూలమైన సమయం. ఇటీవల సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాక్కు నీటి సరఫరాపై ఒత్తిడి పెంచడం వంటి చర్యలు భారత్ వ్యూహాత్మక శక్తిని అద్దం పడుతున్నాయి. ఇదే సమయంలో పాక్లో బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమాలు బలపడుతున్నాయి. ఇవి పాక్ దృష్టిని పీవోకే నుండి మరల్చవచ్చు. ఇలాంటి అవకాశం భారత్కు మరోసారి రాదని సైనిక వ్యూహకర్తలు స్పష్టం చేస్తున్నారు. అందుకే వారు అబ్ నహీతో కభీ నహీ అని నినదిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై కూడా భారత వ్యూహకర్తలు తరుచూ పీవోకే గురించి ప్రస్తావిస్తుండటంతో భారత్ నెక్ట్స్ టార్గెట్ పీవోకే అన్న సంకేతాలు వస్తున్నాయి.
ప్రతికూలతలు ఎక్కువే..
భారత్, పాక్ రెండూ అణ్వాయుధ దేశాలు. ప్రస్తుతం భారత్ దాడి చేస్తున్నప్పటికీ పాక్ ప్రతిస్పందించని స్థితిలో ఉన్నా అణ్వాయుధాల మాట ఎత్తడం లేదు. ఎందుకంటే ఆ దేశం భవిష్యత్తు, అంతర్జాతీయ మద్దతు సాధించాలంటే ఏ స్థాయిలో కూడా అణ్యాయుధ ప్రస్తావన రాకూడదు. ఒకవేళ వస్తే పాక్ పై భారత్ చేస్తున్న దాడులు మరింత తీవ్రమైనా.. అగ్ర రాజ్యాలు కూడా పాక్ ను కట్టడి చేస్తాయి. ఇది పాక్ కు ఏమాత్రం సరైందికాదు. కానీ, పహెల్గాం ఘటన తర్వాత భారత్ తమపై దాడికి దిగితే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోమని ఆ దేశంలోని వివిధ స్థాయుల్లోని మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. కానీ, అవేవీ ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మాత్రం కావు. ఒకవేళ భారత్ పీవోకే వైపు అడుగులు వేస్తే పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే ఇప్పటికే పాక్ లోపౌర ప్రభుత్వం కంటే అక్కడి సైనిక అధికారులకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్ పై ఓటమిని అంగీకరించరని.. అటువంటి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి కీలకమైన స్థానంలో ఉండటంతో తనవద్ద ఉన్న అణు శక్తిని ఉపయోగించకుండా ఉంటారా? అన్నది అందరినీ కలవరపెడుతున్నది. పాక్ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? అన్నది పాక్ పౌర, సైన్యంలోని కీలకమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారా? లేక మరో గాజాగా మార్చుతారా? అన్నది వేచిచూడాల్సి ఉన్నది.
చైనాయే ప్రధాన అడ్డంకి
పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి భారత్కు ఉన్న ప్రధాన అడ్డంకి చైనా. ఎందుకంటే ఆ ప్రాంతంలో చైనా ఆర్థిక కారిడార్ నిర్మిస్తున్నది. ఇందుకు భారీ ఎత్తున నిధులు కూడా ఖర్చు చేసింది. ఇప్పటికే ఆ కారిడార్ పనులు చాలామటుకు పూర్తయ్యాయి. ఇవి వేలకోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిన చైనా.. భారత్ చర్యలపై ప్రతిస్పందించకుండా ఉంటుందా? ఒకవేళ స్పందిస్తే.. ఏ విధంమైన చర్యలకు పూనుకుంటుంది? ఇది దక్షిణాసియా మొత్తాన్ని ప్రభావితం చేస్తుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. భారత్ చర్యలతో చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC)కు నష్టం కలిగితే భద్రతామండలిలో భాగస్వామి అయిన చైనా ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు ప్రస్తుతానికి అంతర్జాతీయ సమాజం నుంచి భారత్ కు మద్దతు లభిస్తున్నా.. పీవోకే లోకి అడుగుపెడితే పరిస్థితులు మారిపోవచ్చు. ఎందుకంటే ఈ సైనిక చర్యలు ఐక్యరాష్ట్ర సమితి రిజల్యూషన్లకు విరుద్ధంగా ఉండవచ్చు. ఇది భారత్పై అంతర్జాతీయ ఆంక్షలకు దారితీయవచ్చు.
స్థానికులు ఎటువైపు
సింధూ జలాలు ముందస్తు హెచ్చరిక చేయకుండానే భారత్ విడుదల చేసినప్పుడు అనేకమంది పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరులు ఆ వీడియోలు ట్విట్టర్ పోస్టు చేశారు. కానీ, ఎక్కడ కూడా భారత్ ను విమర్శిస్తూ.. వ్యాఖ్యలు చేయలేదు. ఇది భారత్ కు సానుకూల అంశం. ఘటనపై పాక్ మీడియా గగ్గోలు పెట్టినా.. పీవోకే పౌరుల్లో అత్యధికులు స్పదించిన తీరుతో వారంతా భారత్కు అనుకూలంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే, స్థానికంగా బలమైన నాయకత్వం లేకుండా పాక్ చూసుకోవడం వల్ల.. అక్కడ నామమాత్రపు అధికారాలతో నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారుకూడా పాక్ ఆర్మీ చెప్పుచేతల్లో ఉండటంతో.. అక్కడి ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతున్నారో పెద్దగా తెలియని పరిస్థితి ఉన్నది. దేశ విభజన నాటినుంచి చూసుకుంటే.. అభివృద్ధి, స్థిరమైన పౌర ప్రభుత్వాలు భారత్ లోనే ఉండటంతో వారిలో అత్యధికులు భారత్ వైపు ఆకర్షితులు కావొచ్చు.
భారత్ ఏం చేయబోతున్నది?
ప్రస్తుతం పీవోకే విషయంలో భారత్ కు సువర్ణావకాశమే అయినా, మోడీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక రంగం అభివృద్ధి దిశలో ఉండటం.. చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ప్రపంచానికి భారత్ ప్రత్యామ్నాయం అవుతున్నది. ఈ సమయంలో అంతర్జాతీయ ఆంక్షలు భారత్ అభివృద్ధిని కల్లెం వేస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి పాక్ ను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపర్చడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సైనిక మద్దతు లేకుండా చూసే అంశానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. కానీ, భవిష్యత్తులోనైనా మోడీ సర్కారు కన్ను ఎప్పుడూ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై ఉండితీరుతుందన్నది మాత్రం స్పష్టం.