వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నామో మా మేనిఫెస్టో చెబుతుంది.. జేపీ నడ్డా కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నామో మా మేనిఫెస్టో చెబుతుంది.. జేపీ నడ్డా కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కీలక ప్రకటన చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి రోజున ‘సంకల్ప్ పత్ర’ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని తెలిపారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామని అన్నారు. ఆయన ఆకాంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2014లో మోడీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కార్ అని చెప్పారు.. ఆ దిశగా అడుగులు వేశారు.

ఇప్పుడు కూడా రాబోయే ఐదేళ్లు ఏం చేస్తామో, చేయబోతున్నామో తమ మేనిఫెస్టో చెబుతుందన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తేనే ప్రగతి సాధ్యమని తాము విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు. మోడీ నాయకత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని చెప్పారు. ప్రజలు తమకు రెండుసార్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని.. మరోసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేశాం, వైద్య సదుపాయం కల్పించామని అన్నారు. ఇవాళ దేశంలో రోడ్డు లేని గ్రామం లేదని చెప్పారు.

Next Story

Most Viewed