ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

by Disha Web Desk 2 |
ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..  ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళుతున్న కారు డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ వైపు నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళుతున్న కారు అతివేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

ఔటర్‌పై భారీగా ట్రాఫిక్ జాం

రోడ్డు ప్రమాదంతో ఔటర్ రింగ్ రోడ్‌పై వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు. ఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారులో అందరూ యువకులే ఉన్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story