ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ..

by  |
ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ..
X

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోకీ బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) వ్యాపించినట్టు ధ్రువీకరణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటి వరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ కేసులను కేంద్రం గుర్తించింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ బర్డ్ ఫ్లూ ఉన్నట్టు ధ్రువీకరించింది. ఢిల్లీ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనూ అనుమానాస్పద స్థితిలో పక్షుల మరణాలు కనిపించాయి. ఈ మూడు రాష్ట్రాల నుంచి శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపించారు. వీటి ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్క రోజే సుమారు 1,200 పక్షులు మృతి చెందాయి. కేవలం మహారాష్ట్రలోనే ఓ పౌల్ట్రీ ఫామ్‌లో 900 పక్షులు మరణించాయి. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫ్లూ వ్యాప్తి కట్టడికి కేంద్రం కసరత్తు చేస్తున్నది.

కట్టడి కోసం స్థానిక సంస్థలను సమన్వయం చేస్తున్నది. కేంద్ర పశుసంవర్ధక శాఖ, డెయిరీ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ఫ్లూ హాట్‌స్పాట్‌లను గుర్తించి కట్టడి చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఎప్పటికప్పుడు వివరాలను అందించాలని ఆదేశించాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి కోసం కొన్ని రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇంకా బర్డ్ ఫ్లూ ఉన్నట్టు కన్ఫమ్ కాకున్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి పక్షుల దిగుమతిని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ఢిల్లీలోని అతిపెద్ద ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మరో పది రోజులు మూసివేయాలని ఆదేశించింది. జసోలా పార్క్‌లో మూడు రోజుల్లో 24 కాకులు, సంజయ్ సరస్సులో పది బాతులు మృతి చెందడంతో కేజ్రీవాల్ సర్కారు అప్రమత్తమైంది. ఈ నెల 15వ తేదీ వరకు లైవ్ కోళ్లు, పక్షులు, పౌల్ట్రీ మాంసం దిగుమతులను పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. పంజాబ్ ‘సేఫ్’ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Next Story

Most Viewed