నేటి యువకులే రేపటి నాయకులు

by Disha Web Desk 15 |
నేటి యువకులే రేపటి నాయకులు
X

దిశ, ఖమ్మం టౌన్ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ యువ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన యువ సమ్మేళనం సందడిగా సాగింది. యువతతోనే దేశం భవిష్యత్తు ఆధారపడిందని, నేటి యువకులే రేపటి నాయకులని తాండ్ర వినోద్ రావు అన్నారు. ఎర్రటి ఎండలో ఆయన యువకులతో కలిసి సభకు ర్యాలీగా వచ్చారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ సమీపంలోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ కార్యాలయం వద్ద బీజేవైఎం నమో యువ సమ్మేళనం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన నాయకుడు ప్రధానమంత్రి మోడీ అన్నారు. రేపు మీరే లీడర్లు అని .. మీలో ఎవరు ఒకరు మోడీ, నడ్డ, నిర్మల సీతారామన్ లాంటి స్థాయిలో ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీలో తండ్రి, కుమారుడు, భార్య మంత్రులుగా లేరని ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యారని అన్నారు.

మా కుటుంబంలో నేనే పొలిటిషన్ గా మొదటి వ్యక్తి అని తెలియజేశారు. యువత, మహిళల ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తానని తెలియజేశారు. నాకు ఓటు వేస్తే నరేంద్ర మోడీ కి ఓటు వేసినట్లే అని పేర్కొన్నారు. సభలో పాల్గొన్న మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ రామారావు మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడలేని ఎండలు ఇక్కడ ఉన్నా ఇంత మంది ఈ సదస్సుకు రావడం అభినందనీయమన్నారు. నిత్యం పేద, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే వ్యక్తి వినోద్ రావు అన్నారు. యువకులు తలుచుకుంటే రాజకీయాల్లో అన్ని సాధ్యమవుతాయని , భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది అన్నారు. ఖమ్మంలో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. మోడీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్ ఉండవని కాంగ్రెస్, బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నాయని, దీనిని యువత తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్లమెంటుకు ప్రధాన మంత్రి మోడీ సాష్టాంగ దండం పెట్టిన పార్లమెంట్లోకి ప్రవేశించారని అన్నారు. పార్లమెంటుకు అంత విలువ ఇస్తున్న మోడీ రిజర్వేషన్లు, రాజ్యాంగం మారుస్తారనేది విపక్షాల ప్రచారం చేయడం శోచనీయమన్నారు.

యువ మోర్చా పార్లమెంట్ ప్రభరి, ఎంపీటీసీ మధు మాట్లాడుతూ యువ మోర్చకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఒక కార్యకర్త 100 మందితో సమానమని చెప్పారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిధులేనని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు మన అభ్యర్థి వినోద్ రావని, ఆయన గెలుపు కోసం యువత కృషి చేయాలని కోరారు. ఖమ్మంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ 15 లక్షల ఇళ్లు ఉంటే 14 లక్షల 90 వేల ఇళ్ల కు కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు వెళ్లాయని తెలిపారు.

మన బీజేపీ అభ్యర్థి వినోద్ రావు అంటే లోకల్ అని , ప్రత్యర్థులు నాన్ లోకల్ అని విమర్శించారు. సభలో పార్టీ అభ్యర్థి వినోద్​రావును గజమాల, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో యువమోర్చా నాయకులు ఈదుల వీరభద్రం, మునేష్, శ్రీనివాస్, రవితేజ, పాల నాగ సురేందర్ రెడ్డి, పృథ్వీ, వినయ్, కొండ గోపి, నాగ చారి, సోమ దరియాసింగ్, వెంకట్ నారాయణ యాదవ్, పరశురాం, లక్ష్మారెడ్డి, ఉదయ్, ఉపేందర్, శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా నాయకులు, మండల నాయకులు, బూత్​ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Next Story