తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుతం.. 7 వికెట్ల తేడాతో విజయం

by Swamyn |
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుతం.. 7 వికెట్ల తేడాతో విజయం
X

దిశ, స్పోర్ట్స్: ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ సత్తాచాటింది. చెన్నయ్‌‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్-17లో భాగంగా చెన్నయ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని వారి సొంతగడ్డపైనే దెబ్బకొట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే పరిమితం చేసింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు పడగొట్టి 162 పరుగులు మాత్రమే ఇచ్చింది. చెన్నయ్ బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(62) మినహా మిగతావారెవరూ అంతగా రాణించలేదు. ఇక, 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. జానీ బెయిర్‌స్టో(46), రిలీ రస్సో(43) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా 7 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టగా, రబాడా, అర్షదీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. చెన్నయ్ బౌలర్లలో శార్దుల్ థాకూర్, రిచర్డ్ గ్లీసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఆడుతూ పాడుతూ..

163 పరుగుల మోస్తరు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు.. శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(13) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. దీంతో 19 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిలీ రస్సో(43), మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(46)లు కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లక్ష్యం తక్కువే అవడంతో ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. జానీ బెయిర్‌స్టో కొంత నెమ్మదిగా ఆడితే, రిలీ రస్సో మాత్రం దూకుడును ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి 60 పరుగులకు పైగా భాగస్వామ్యం నిర్మించారు. అర్ధసెంచరీకి మరో నాలుగు పరుగుల దూరంలో బెయిర్‌ స్టో దూబే బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బెయిర్ స్టో అవుటైన కొద్దిసేపటికే థాకూర్ బౌలింగ్‌లో రస్సో బౌల్డ్ అయ్యాడు. దీంతో 113 పరుగులయ్యేసరికి పంజాబ్ తొలి మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతిలోకి వచ్చింది. దీంతో ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్(25 నాటౌట్), సామ్ కరన్(26 నాటౌట్) మిగతా పనిని పూర్తిచేశారు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్నందించారు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, అన్నింటిలోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

గైక్వాడ్ ఒంటరి పోరాటం

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నయ్ జట్టును పంజాబ్ బౌలర్లు వణికించారు. ఓపెనర్లు రహానే(29), రుతురాజ్ గైక్వాడ్(69)ల జోడీ జట్టుకు మంచి ఆరంభమే ఇచ్చింది. తొలి వికెట్‌కు వీరు 64 పరుగులు జోడించారు. అయితే, అప్పటికే కాస్త తడబడుతూ ఆడుతున్న రహానేను హర్‌ప్రీత్ బ్రార్ క్యాచ్ అవుట్ చేసి పెవిలియన్ పంపించాడు. దీంతో 64 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే(0)ను సైతం హర్‌ప్రీత్ ఎల్బీడబ్ల్యూతో డకౌట్ చేశాడు. ఆ తర్వాత జడేజా(2), సమీర్ రిజ్వీ(21), మొయిన్ (15), ధోనీ(14) సైతం దారుణంగా విఫలమయ్యారు. అయితే, ఓ వైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఆచితూచి ఆడుతూ జట్టుకు ఓ మోస్తరు స్కోరు అందించగలిగాడు. మరో ఎండ్ నుంచి అంతగా సహకారం లభించకపోవడంతో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న కాసేపటికి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్, ధోనీ మెరుపులు మెరిపించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Next Story

Most Viewed