తత్వం బోధపడినా… తీరు మారదా?

by Disha edit |
తత్వం బోధపడినా… తీరు మారదా?
X

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత,ఉద్యమాల అనంతరం అసలైన ఉద్యమకారులను కాదని వలసవాదులను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు ద్రోహంగా వ్యవహరించిన వాళ్లను సైతం తమ పార్టీలో చేర్చుకొని వారికి ముఖ్యమైన పదవులు ఇచ్చి వాళ్లను ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి ఇంతకాలం అసలైన ఉద్యమకారులకు ద్రోహం చేసింది నాటి టీఆర్ఎస్, ఇప్పుడు ఉద్యమకారులే మిగిలారంటూ ఓ వైపు చెబుతూనే… మరోవైపు మళ్ళీ ఉద్యమకారులకి సీట్లవ్వకుండా నేడు అదే బాటను కొనసాగిస్తూ వస్తుంది నేటీ బీఆర్ఎస్.

గత దశాబ్ద కాలంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా హెచ్చరిస్తూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకి చోటులేదని దీనిపై టీఆర్ఎస్ అధినాయకత్వానికి ఎంత మంచి మాట చెప్పినా వినిపించుకోకపోగా అశ్రద్ధ చేస్తూ, మేమే ఉద్యమకారులం మేము చేస్తేనే తెలంగాణ వచ్చింది అన్నట్టుగా విర్రవీగారు. కానీ చివరికి ఏమైంది వారికి వాస్తవాలు తెలిసొచ్చేలా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.

ఈయన ఉద్యమకారుడు ఎలా అవుతాడు?

అప్పుడు ఉద్యమానికి సంబంధం లేని నాయకులు ఎలాగైతే పార్టీలోకి చేరి.. పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అసలు రూపం బయటపెట్టి పార్టీని ఒంటరిని చేసి వెళ్లిపోయారు ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని ఓ దశలో వార్తలు కూడా గుప్పుమన్నాయి. స్వార్థపరుల నుండి తత్వం బోధపడి ఇప్పుడైనా పార్టీని కాపాడుకోవడానికి నిజమైన ఉద్యమకారులకు పార్లమెంటరీ అభ్యర్థులకీ సీట్లు ఇస్తున్నారా? అంటే అదీ లేదు.. ఇప్పుడు కూడా ఉద్యమకారులకు ఏమాత్రం సంబంధం లేని వాళ్లను కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడక్కడ ఎంపీ అభ్యర్థులుగా నిలిపారు. మరి దీన్ని ఏమనుకోవాలి.

ఉదాహరణగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే గతంలో కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీగా చేశారు ఇప్పుడు ఆ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వ్యక్తి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం ఆ వ్యక్తి చేసిన త్యాగం ఏమిటి? పోరాటాలు ఏమిటి ధర్నాలు ఏమిటి? రాస్తారోకోలు ఏమిటి? నిరసనలు ఏమిటి? అతను ఏ విధంగా ఉద్యమకారుడవుతాడని మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కాకుండా సాధారణ పౌరులు కూడా చర్చించుకుంటున్నారు. ఉద్యమ సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ తమ ఆస్తులు విలువైన జీవితాన్ని కోల్పోయి చేసిన త్యాగం ఏమీ లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

అమరుల ప్రాణత్యాగాల మాటేమిటి?

కానీ యావత్ తెలంగాణ ప్రజలు ఎన్నో వందల వేల లక్షల మంది విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోయి తెలంగాణ కోసం కొట్లాడారని ఇందులో ఎన్నో వేల మంది ప్రాణ త్యాగాలు చేసి అమరులయ్యారని, ఇప్పుడు అమరవీరుల ఆత్మ ఘొషిస్తోందని కూడా చర్చించుకుంటున్నారు అసలైన ఉద్యమకారులు. ఇప్పుడు పార్టీలో ఉద్యమకారులే మిగిలినారు. అంతా స్వార్థపూరితమైన వ్యక్తులు పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అసలు రూపం బయటపెట్టి పార్టీని ఒంటరిని చేసి వెళ్లిపోయారు అంటున్నారు కేటిఆర్. మరి ఇప్పటికైనా మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఒక ఉద్యమకారుడికి ఎందుకు ఇవ్వలేదని అని బీఆర్ఎస్ పార్టీని నిలదీస్తున్న వైనం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొన్నది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విధమైన వైఖరితో ముందుకు పోతే నిలదొక్కుకోగలదా? జనాల ఓట్లను రాబట్టుకోగలదా అని మేధావి వర్గం కూడా ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశం ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో!

సింగోజు మురళీ కృష్ణ

తెలంగాణ ఉద్యమ కారుడు, జర్నలిస్ట్

99850 21041



Next Story

Most Viewed