మేనిఫెస్టోలు.. ఆశలు తీర్చేవా.. అకాంక్షలు తీర్చేవా?

by Disha edit |
మేనిఫెస్టోలు.. ఆశలు తీర్చేవా.. అకాంక్షలు తీర్చేవా?
X

సాధారణ భాషలో అర్థం చేసుకుంటే, మ్యానిఫెస్టో అనేది ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు జారీ చేసే పత్రం. దీని ద్వారా రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాయో చెబుతాయి. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి? ప్రజా ప్రయోజనం ఎంత? ఈ విధంగా, మేనిఫెస్టోలో హామీలు ఉంటాయి. వాటి ద్వారానే అన్ని పార్టీలు ఓట్లు కోరుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటనలో రాజకీయపార్టీల ఇష్టారాజ్యం ఉండదు. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు ఇవ్వడం...గెలిచాక అమలు చేయకపోవడం..లేకపోతే ఆచరణ సాధ్యం కాని హామీలతో ఓట్లు కొల్లగొల్లడదామంటే ఎన్నికల ప్రవర్తనర్త నియమావళి అంగీకరించదు.

ఎందుకంటే..ఎన్నికల ప్రవర్తన నియమావళిలో 8వ భాగంగా మేనిఫెస్టో చేర్చుతూ 2015 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఎలా ఉండాలి? ఎలా ఉండరాదు? అన్న అంశాలు ఉన్నాయి. దీంతో మేనిఫెస్టోల విషయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించకతప్పని పరిస్థితి ఏర్పడింది.

రాజకీయాల్లో ఎన్నికలు అత్యంత కీలకం. అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలే ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తాయి. అందుకే మేనిఫెస్టో రూపకల్పన అనేది అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

‘సుప్రీం’ చొరవతో మేనిఫెస్టోకు పారదర్శకత

ఎన్నికల మేనిఫెస్టోలో ఉండాల్సిన హామీల విషయంలో రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలను నిర్దేశించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 జూలై 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్.సుబ్రమణ్యం బాలాజీ వేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తన తీర్పులో చేసిన సూచనల ఆధారంగా మేనిఫెస్టోలపై మార్గదర్శకాలను ఈసీఐ రూపకల్పన చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలు ప్రకారం.. మేనిఫేస్టోలోని హామీలను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అవినీతి చర్యలుగా పరిగణించడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ, ఏ విధమైన ఉచిత హామీలైనా ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. స్వేచ్ఛా యుతంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలకు ఇలాంటి హామీలతో తీవ్రస్థాయిలో కుదుపునకు గురవుతాయి కనుక ఎన్నికల్లో పోటీపడే పార్టీ లు/అభ్యర్థుల సమాన అవకాశాలను పరిరక్షించడానికి, స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎన్నికల సంఘం గతంలో సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది.

హామీలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి

అయితే, ఈ మేనిఫెస్టోలో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, విలువలకు భంగం కలిగించే అంశాలేమీ ఉండరాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఉండాలి. పౌరులకు వివిధ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలని.. ప్రభుత్వ విధానాలపై రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మేనిఫెస్టోల్లో వాగ్దానాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఆ హామీలు ఉండరాదు. ఓటు వినియోగించే విషయంలో ఓటర్లను అనుచిత ప్రలోభాలకు గురి చేయకూడదు.మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు హేతుబద్ధంగా ఉండాలి. వీటి అమలుకు అనుసరించే మార్గాలు, అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ సైతం సవివరంగా ఓటర్లకు తెలియజేయాలి. నెరవేర్చగలిగే వాగ్దానాల ద్వారానే ఓటర్ల నమ్మకాన్ని కోరాలి.

ప్రధానదేశాల్లో విధానాలే హామీలు

అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, స్వీడన్, కెనడా, నెదర్లాండ్, ఆ్రస్టియా, ఇతర పశ్చిమ ఐరోపా దేశాల్లొ వ్యక్తిగత లబ్ధి కలిగించే ఉచిత హామీలు మేనిఫెస్టోల్లో ప్రకటించరు. రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్థిక విధానాలు, విదేశీ వ్యవహారాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనా సంస్కరణలు, పర్యావరణ అంశాలు, వలసలు వంటి అంశాలపై తమ విధానాలను మాత్రమే ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి.

ఇకపోతే ఏపీలో కూడా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. పార్టీలన్నీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు పార్టీలు రూపొందించిన మేనిఫెస్టోల్లో ప్రజలు దేనిని నమ్ముతారనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

-శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story

Most Viewed